
మూడు దశాబ్దాలకుపైగా పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబీకులే తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా 1978లో పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి ఇక్కడ తిరుగేలేదు. నిత్యం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అమితమైన అభిమానం సంపాదించారు. వైఎస్ఆర్ వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యాక కడప లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ఆర్ తర్వాత సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి, చిన్నాన్న వైఎస్ పరుషోత్తం రెడ్డి విజయ బావుటా ఎగురవేశారు. 1999లో వైఎస్ఆర్ పులివెందుల నుంచి గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. చరిత్రాత్మక పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాగా వైఎస్ఆర్ అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ గెలుపొందారు. వైఎస్ కుటుంబం నుంచి పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచిన ఐదో వ్యక్తి వైఎస్ జగన్ కావడం విశేషం.